మురళీమోహన్ ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’
మురళీమోహన్ ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’
కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు.
